కలం, వెబ్ డెస్క్: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమా (Fauji Movie) షూటింగ్ దాదాపు కొలిక్కి వచ్చింది. మరో ఆరు నెలల్లో పూర్తి కానున్నట్లు ఫౌజీ చిత్ర యూనిట్ తెలిపింది. ఇటీవల ఈ సినిమా సెట్స్లో నటుడు రాజేశ్ శర్మ (Rajesh Sharma) తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోల్కతాలోని ఢాకురియాలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్లోని రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ విషపు పురుగు ఆయనను కరిచిందనే పుకార్లు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.
ఈ పుకార్లపై రాజేశ్ శర్మ పీఏ స్పందించారు. రాజేశ్ శర్మకు పురుగు కరవలేదని, ఆయన గత కొన్ని రోజులుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడని, ఆ సైడ్ ఎఫెక్ట్ వల్ల అస్వతతకు గురయ్యారని తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశాడు. దీనిపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) స్పందించింది. ఈ ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయిలో విచార జరపాలని ఫౌజీ యూనిట్ను డిమాండ్ చేసింది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని, నటుడి ఆరోగ్యం క్షీణించడానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని కోరింది.
అంతే కాకుండా ఫౌజీ చిత్ర యూనిట్ను కొన్ని ప్రశ్నలు అడిగింది. హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో రాజేశ్ పరిస్థితి విషమించినపుడు హైదరాబాద్లోని హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ చేయలేదని ప్రశ్నించింది. భద్రత, పరిశుభ్రత, వైద్య నియమాలకు సంబంధించిన నిబంధనలను నిర్మాణ బృందం పాటించిందా లేదా అనే విషయంపై అధికారులు పరిశీలన జరపాలని కోరింది. రాజేశ్ శర్మ చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును ఫౌజీ చిత్ర బృందం భరించాలని డిమాండ్ చేసింది.

