కలం, వెబ్ డెస్క్: ఏపీలో పోలీస్ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైందని, పోలీసులే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) విమర్శించారు. తాడేపల్లిలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్పై దాడి చేసి మళ్లీ ఆయనపైనే కేసు పెట్టడం అన్యాయమన్నారు. కూటమి పాలనలో ప్రతి చోటా ఇలాగే జరుగుతోందని విమర్శించారు. దాడులు, కేసులు రెండు తమపైనే జరుగుతున్నాయన్నారు.
ఈ ఘటనపై మాట్లాడి ఎస్పీకి వినతిపత్రం సమర్పించేందుకు వచ్చినట్లు అంబటి తెలిపారు. అయితే ఎస్పీ తమకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆఫీస్లో అందుబాటులో లేకుండా వెళ్లిపోయారన్నారు. వినతి పత్రం తీసుకోవడానికి మంత్రి నారా లోకేశ్ పర్మిషన్ కావాలా? అని ఎద్దేవా చేశారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై, అక్రమాలపై సమాధానం చెప్పలేదని స్థితిలో ఏపీ పోలీస్ వ్యవస్థ ఉందన్నారు. వైసీపీ హయాంలో ఇంత దారుణంగా వ్యవహరించలేదని చెప్పారు.
కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనపై హత్యాయత్నం జరిగిందని ఎమ్మెల్సీ అరుణ్ ఆరోపిస్తున్నారు. దాడిపై ఇప్పటికే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఆధారాలు ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, తిరిగి తనపైనే కేసు పెట్టారని చెప్తున్నారు.

