కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) లో తెలంగాణ ఐసెట్ 2026 (TG ICET 2026) తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించినట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి ప్రకటించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సాఫీగా పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఉదయం సెషన్లో ప్రశ్నాపత్రం సెట్ కోడ్ “A” ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉన్నత ప్రమాణాలతో పరీక్ష నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి విశ్వవిద్యాలయానికి బాధ్యతలు అప్పగించడం ద్వారా సామర్థ్యాల పెంపు, భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.
మొదటి సెషన్లో 18,783 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 16,965 మంది హాజరయ్యారు. 1,818 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 90.3గా నమోదైంది. మధ్యాహ్న సెషన్లో 18,712 మంది నమోదు కాగా 17,122 మంది పరీక్షకు హాజరయ్యారు. 1,590 మంది గైర్హాజరయ్యారు. ఈ సెషన్లో హాజరు శాతం 91.5గా నమోదైంది. మొత్తం తొలి రోజు పరీక్షకు 37,495 మంది నమోదు కాగా 34,087 మంది హాజరయ్యారు. 3,487 మంది గైర్హాజరయ్యారు. మొత్తం హాజరు శాతం 90.09గా నమోదైనట్లు కన్వీనర్ తెలిపారు. మధ్యాహ్న సెషన్లో రెండో ప్రశ్నాపత్రం సెట్ కోడ్ “B” ను తెలంగాణ ఐసెట్ 2026 వైస్ చాన్స్లర్, చైర్మన్ ప్రొఫెసర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాలా పురుషోత్తం, సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. అంజిరెడ్డి తదితరులు పాల్గొని పరీక్షల నిర్వహణను సమీక్షించారు.

