కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఐటీ హబ్ గచ్చిబౌలి (Gachibowli) లో విషాదం చోటు చేసుకుంది. గౌలిదొడ్డిలోని ఓ ప్రైవేట్ లేడీస్ పీజీ హాస్టల్లో లిఫ్ట్ ప్రమాదానికి గురై 5 ఏళ్ల బాలిక మృతి చెందింది. మృతురాలిని పశ్చిమ బెంగాల్కు చెందిన బిస్తూ ఘోష్గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. తాత, అమ్మమ్మతో కలిసి హాస్టల్లో భవనంలో నివాసం ఉంటున్న బాలిక ఆడుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఐదో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కగా, దురదృష్టవశాత్తూ ఆమె జుట్టు లిఫ్ట్ గ్రిల్లో చిక్కుకుపోయింది.
లిఫ్ట్ కదులుతున్న సమయంలో ఒక్కసారిగా తల గ్రిల్ కు, గోడకు మధ్య నలిగిపోవడంతో చిన్నారి తల నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయిన బాలిక మృతదేహాన్నివెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మనవరాలి మృతిపై తాత, అమ్మమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో నిండిపోయింది.

