కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (KTR) కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జనగామ సమీపంలోని పెంబర్తి వద్ద జాతీయ రహదారిపై పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి కేటీఆర్ కాన్వాయ్ను నిలిపివేశారు. కేవలం కేటీఆర్ కు మాత్రమే అనుమతిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ను అడ్డుకోవడంతో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
కేటీఆర్ (KTR) పర్యటనను అడ్డుకున్నారనే సమాచారం తెలియడంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పెంబర్తి హైవే వద్దకు చేరుకున్నారు. పోలీసుల ఆంక్షలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. ముందస్తు అనుమతులు లేవనే కారణంతోనే కాన్వాయ్ను నిలిపివేసినట్లు పోలీసులు చెబుతుండగా, ప్రభుత్వ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమను అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

