కలం, వెబ్ డెస్క్: తెలంగాణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో మరోసారి మెరిశారు. పుదుచ్చేరి వేదికగా జరిగిన బాలురు, బాలికల సౌత్ ఇండియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో రజత పతకాలు సాధించారు. షేక్పేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల రాష్ట్ర క్రీడా అకాడమీ (TSWREIS) కుస్తీ విభాగంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఈ ఘనత సాధించి రాష్ట్ర కీర్తిని చాటారు. ఈ పోటీల్లో ముధోల్ పాఠశాలకు చెందిన జి. రణవీర్, అలాగే వీపనగండ్ల పాఠశాలకు చెందిన ఎ. అరవింద్ పట్టుదలతో పోరాడి తలో ఒక రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. అకాడమీలో లభిస్తున్న అత్యుత్తమ శిక్షణ, వీరి కఠిన శ్రమ వల్లే ఈ పతకాలు సాధ్యమయ్యాయి.
దక్షిణ భారత స్థాయిలో పతకాలు సాధించి తిరిగొచ్చిన ఈ యువ రెజ్లర్లను, వారికి అండగా నిలిచిన కోచింగ్ సిబ్బందిని తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ అండ్ జూనియర్ కాలేజెస్ పీడీలు, పీఈటీల సంఘం చైర్మన్ డాక్టర్ రామలక్ష్మణ్ ప్రత్యేకంగా అభినందించారు. ఆయనతో పాటు అసోసియేషన్ ప్రతినిధులు నర్సయ్య, చందర్, హరికిషన్ తదితర అధికారులు కూడా విజేతలను కొనియాడారు. భవిష్యత్తులో వీరు మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలని క్రీడా వర్గాలు కోరుకుంటున్నాయి.
Read Also: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టికెట్ల షెడ్యూల్ విడుదల
Follow Us On: WhatsApp

