కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) సిట్ దర్యాప్తు ఊహించని టర్న్ తీసుకునే అవకాశమున్నదా?.. హరీశ్రావును మళ్ళీ విచారణకు పిలుస్తారా? కొంతమంది అరెస్టులు తప్పవా?.. ముఖ్యమంత్రిని (CM Revanth Reddy) సైతం సిట్ ఎంక్వయిరీకి పిలుస్తుందా?.. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరయ్యేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారా?… ఇలాంటి అనేక ప్రశ్నలకు పాజిటివ్ సమాధానాలే వినిపిస్తున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌజ్లో ఇటీవల డ్రగ్స్ (Drugs) పట్టుబడిన వ్యవహారంపై మరో ‘సిట్’ (SIT) జరుపుతున్న దర్యాప్తు కూడా చివరకు అక్కడికే దారితీసే అవకాశాలు లేకపోలేదు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేసీఆర్ను విచారణకు పిలిచిన తర్వాత వేగం తగ్గిందన్న అభిప్రాయం నెలకొన్నది. కానీ సిట్ తదుపరి యాక్షన్ ప్లాన్ను రెడీ చేసుకుంటున్నదనే లీకులు వెలువడ్డాయి.
సీఎం చిట్చాట్ కామెంట్తో సందేహాలు
రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిట్చాట్ సందర్భంగా కొన్ని ఆసక్తికర కామెంట్లు చేయడం ఫోన్ ట్యాపింగ్ తదుపరి ఏ డైరెక్షన్లోకి వెళ్ళనున్నదో సంకేతాలు ఇచ్చినట్లయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్రావును ఇంకా విచారించనే లేదని, కేవలం చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన అంశానికి మాత్రమే సిట్ పరిమితమైందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హరీశ్రావు ఈ ఎంక్వయిరీ ప్రాధాన్యతను తనదైన శైలిలో ట్విస్ట్ చేశారని అర్థంలో వ్యాఖ్యలు చేశారు. నిజానికి చక్రధర్ కేసు తీర్పును హరీశ్రావు (Harish Rao) ఫోన్ ట్యాపింగ్లో మెయిన్ అంశానికి ఆపాదించుకుంటున్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) హరీశ్రావు విచారణ జరగాల్సి ఉన్నదనే అభిప్రాయాన్ని వెల్లడించారు. దర్యాప్తుపై సిట్ టీమ్కు స్పష్టమైన ప్లానింగ్ ఉంటుందన్నారు.
నన్ను పిలిస్తే విచారణకు హాజరవుతా
బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చాలా సీరియస్ అంశమని, దాదాపు ఆరు వేల మంది ఫోన్ల ట్యాపింగ్ జరిగిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ కేసుపై విచారణ వేగంగానే జరుగుతున్నదని, మొత్తం మోడస్ ఆపరాండిని సిట్ టీమ్ వెలికి తీస్తుందని, వ్యక్తుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండతా దర్యాప్తు జరుగుతుందన్నారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదన్నారు. ఎవరి కోసమో విచారణను ఇష్టారీతిలో చేయడం వీలుపడదన్నారు. సూత్రధారులెవరో, పాత్రధారులెవరో సిట్ వెలికి తీస్తుందన్నారు. “నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న అనుమానాన్ని పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడే ఓపెన్గా చెప్పాను.. నాకు ఇప్పటివరకు నోటీసులు ఇవ్వలేదు… ఒక సాక్షిగా నన్ను ఎంక్వయిరీ చేయలేదు.. నా స్టేట్మెంట్ను రికార్డు చేయలేదు.. ఒకవేళ సిట్ నాకు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని పిలిస్తే తప్పకుండా హాజరై నా దగ్గరున్న సమాచారాన్ని వారికి ఇస్తా..” అని క్లారిటీ ఇచ్చారు.
సీఎం కామెంట్లతో సరికొత్త టెన్షన్ :
సద్దుమణిగిందనుకున్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యూసీ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) చిట్చాట్ ద్వారా లేవనెత్తడంతో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే ఆసక్తి ఒకవైపు బీఆర్ఎస్ నేతల్లో గుబులు మరోవైపు మొదలయ్యాయి. సిట్ పిలిస్తే విచారణకు హాజరై వివరాలిస్తానని చెప్పడం గమనార్హం. పలువురు ఎమ్మెల్యేలు, పొలిటీషియన్లు సైతం ఫోన్ ట్యాపింగ్పై ఆరోపణలు చేయడంతో వారిని కూడా పిలుస్తారేమోననే చర్చ స్టార్ట్ అయింది. కల్వకుంట్ల కవిత సైతం “ఇంటల్లుడి ఫోన్ను ట్యాప్ చేయడానికి సిగ్గుండాలె..” అంటూ కామెంట్ చేసినందువల్ల ఆమెనుగానీ, ఆమె భర్తనుగానీ నోటీసులిచ్చి సిట్ విచారణకు పిలుస్తుందేమోననే చర్చ చాలాకాలంగానే ఉంది. ఇక హరీశ్రావ్ స్టేట్మెంట్ ఇంకా రికార్డు అవుతూ ఉంది అని చెప్పడంతో త్వరలో మరోమారు ఆయనను విచారణకు పిలవడం ఖాయమనే సంకేతాలు వెలువడినట్లయింది.
Read Also: తెలంగాణ బడ్జెట్ స్పెషల్ : ప్రతీ కుటుంబానికి భరోసా
Follow Us On: Instagram

