కలం, స్పోర్ట్స్ : గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించి దేశ గౌరవాన్ని పెంచిన జూడో క్రీడాకారిణి అస్మిత డే (Asmita Dey) త్వరలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అస్మితకు ఉన్నతాధికారులు ప్రమోషన్ను ఖరారు చేశారు. ఆమె DSP ప్రమోషన్కు సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆమోదం కోసం పంపినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 48 కేజీల జూడో విభాగం ఫైనల్లో కెనడాకు చెందిన హెయిడీ క్వాచ్ను ఓడించిన అస్మిత డే(Asmita Dey) స్వర్ణ పతకం సాధించారు. కామన్వెల్త్ జూడో చరిత్రలో భారత్కు తొలి స్వర్ణ పతకం అందించిన క్రీడాకారిణిగా ఆమె అరుదైన రికార్డు సృష్టించారు. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా పోలీస్ శాఖ ఆమెకు ఉన్నత పదవి కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీస్ శాఖ నుంచి ఆర్థిక సహకారం, ప్రోత్సాహం లభించిందని పేర్కొన్న అస్మిత.. ఈ ప్రమోషన్ను తన తండ్రి జ్ఞాపకాలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. తుది ఉత్తర్వులు వెలువడే వరకు ఆమె ప్రస్తుత హోదాలోనే కొనసాగనున్నారు. త్రిపురలో జన్మించిన అస్మిత డే.. కానిస్టేబుల్గా తన కెరీర్ ప్రారంభించి, కృషి, పట్టుదలతో DSP స్థాయికి చేరుకోవడం స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

