కలం, స్పోర్ట్స్: లేహ్ కింగ్స్తో చివరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత ఆర్మీ ఐస్ హాకీ (Indian Army Ice Hockey) జట్టు 6-5తో విజయం సాధించింది. చివరి క్షణాల్లో పద్మ నామ్గైల్ చేసిన గోల్తో తొలి ఛాలెంజర్స్ కప్ను కైవసం చేసుకుంది. లేహ్లో జరిగిన తొలి చాలెంజర్స్ కప్ ఫైనల్ అభిమానులకు ఉత్కంఠభరిత పోరును అందించింది. లేహ్ కింగ్స్ తొలి గోల్తో ఆధిక్యంలోకి వెళ్లినా, భారత ఆర్మీ వెంటనే సమాధానం ఇచ్చింది. తొలి పీరియడ్ ముగిసే సమయానికి 2-1తో ముందంజలో నిలిచింది.
నామ్గైల్ గోల్తో..
రెండో పీరియడ్లో భారత ఆర్మీ 3-1 ఆధిక్యం సాధించింది. కానీ స్టాంజిన్ ఆంగ్చోక్ వరుస రెండు గోల్స్తో లేహ్ కింగ్స్ స్కోరును సమం చేసింది. అనంతరం రెండు జట్లు మరోసారి చెరో గోల్ చేయడంతో స్కోరు 4-4గా మారింది. మూడో పీరియడ్ ప్రారంభంలో స్టాంజిన్ ఆంగ్చోక్ హ్యాట్రిక్ పూర్తి చేసి లేహ్ కింగ్స్కు 5-4 ఆధిక్యం అందించాడు. అయితే జిగ్మత్ కుంజాంగ్ స్కోరును సమం చేశాడు. చివర్లో పద్మ నామ్గైల్ చేసిన నిర్ణాయక గోల్తో భారత ఆర్మీ 6-5తో గెలిచి తొలి చాలెంజర్స్ కప్ను సొంతం చేసుకుంది.
బెస్ట్ గోల్కీపర్గా సోనం ట్సెటాన్..
టోర్నీలో భారత ఆర్మీ గోల్కీపర్ సోనం ట్సెటాన్ బెస్ట్ గోల్కీపర్గా ఎంపికయ్యాడు. లేహ్ కింగ్స్ ఆటగాడు ట్సెరింగ్ ఆంగ్చుక్ బెస్ట్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. రాయల్ ఎన్ఫీల్డ్ సోషల్ మిషన్ ఆధ్వర్యంలో, లడఖ్, లాహౌల్-స్పితి ఐస్ హాకీ సంఘాల సహకారంతో ఈ టోర్నీ నిర్వహించారు. ఐదు జట్లు పోటీపడగా, యువ ఆటగాళ్లకు ఉన్నత స్థాయి పోటీల అనుభవాన్ని అందించే వేదికగా ఈ టోర్నీ నిలిచింది.

