కలం, ఖమ్మం బ్యూరో : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ప్రచారాన్ని.. కొంత మంది వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కృత్రిమ గ్యాస్ కొరతను సృష్టించి గృహ వినియోగ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఖమ్మం (Khammam) జిల్లా రఘునాథపాలెం (Raghunadhapalem) మీ సేవ కేంద్రంలో ఆపరేటర్ దుర్గారావు 32 సిలిండర్లను అక్రమంగా నిల్వ చేశాడు. సమాచారం అందుకున్న జిల్లా పౌరసరఫరాల అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించి సిలిండర్లను స్వాధీనం చేసుకొని దుర్గారావు మీద ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 6A ప్రకారం కేసు నమోదు చేశారు.
అలాగే గృహ వినియోగ సిలిండర్లను వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తున్న ఖమ్మం (Khammam) ఎన్టీఆర్ సర్కిల్ లోని భవాని బిర్యానీ హోటల్ పై అధికారులు దాడులు నిర్వహించి 3 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. రఘునాథ పాలెం సితార హోటల్ పై దాడులు నిర్వహించి 4 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

