కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని రాయదుర్గం భూముల వేలానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూముల వేలం ప్రక్రియపై కోర్టు స్టే విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోంది. ఈ మేరకు ప్రతివాదులైన ప్రభుత్వ అధికారులకు, సంబంధిత విభాగాలకు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి మూడు వారాల గడువు విధిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
హైదరాబాద్ ఐటీ హబ్కు గుండెకాయ లాంటి రాయదుర్గం (Raidurgam) ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములపై చర్చ నడుస్తోంది. కోట్ల రూపాయల విలువైన ఈ ప్రభుత్వ భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలతో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు రావడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. వివాదాస్పద సర్వే నంబర్లలోని భూములను రక్షించేందుకు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఎటువంటి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని, అక్కడ ఉన్న ప్రభుత్వ బోర్డులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

