కలం, మహబూబ్నగర్ బ్యూరో : జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లాలో గురువారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. న్యాయం కోసం ఒక వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడటంతో జిల్లా కేంద్రంలో కలకలం రేగింది. బాధితుడు నరేష్ చారి, తన భార్యతో ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపిస్తూ, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటన గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో చోటుచేసుకుంది. నరేష్ చారి పెట్రోల్ బాటిల్తో వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి, న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు గద్వాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించాడు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.
విషయం తెలుసుకున్న గద్వాల సీఐ టి. శ్రీను వెంటనే సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. వాటర్ ట్యాంక్ పై ఉన్న నరేష్ చారితో ఫోన్ ద్వారా మాట్లాడి కౌన్సెలింగ్ చేశారు. బాధితుడికి న్యాయం చేస్తామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఐ ఇచ్చిన హామీతో నరేష్ చారి శాంతించి, చివరికి వాటర్ ట్యాంక్ దిగివచ్చాడు. దీంతో గంటల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

