కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (Telangana Formation Day) నేడు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న ప్రధాన ఉత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, వేడుకలను గంటన్నర లోపే ముగించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో స్పీకర్, శాసనమండలిలో చైర్మన్ అధికారికంగా జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు. రాజకీయ పార్టీల కార్యాలయాల్లోనూ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బూర నర్సయ్యగౌడ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఆవిర్భావ దినోత్సవ వేడుకల పురస్కరించుకుని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. బేగంపేట, సంగీత్ జంక్షన్, తిరుమలగిరి, బోయిన్పల్లి మార్గాల్లో ప్రయాణించే వాహనాలను ప్రత్యామ్నాయ దారుల్లోకి మళ్లించనున్నారు. వాహనదారులు ఈ మార్పులను గమనించి సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

