కలం, వెబ్ డెస్క్ : ఎండ వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్ దక్కనుంది. నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల రెండోవారంలో తెలంగాణకు రుతుపవనాలు వస్తాయని వెల్లడించింది. దీంతో తొలకరి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న రైతులకు ఈ వార్త ఊరటను కలిగిస్తోంది.
మరోవైపు రుతుపవనాల ముందర తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేటి నుంచి 4 రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. అంతేకాదు నేడు, రేపు కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈదురు గాలుల సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

