కలం, వెబ్డెస్క్: తెలంగాణ ఈగల్ టీమ్ (Telangana Eagle Team)లో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. నిషేధిత డ్రగ్స్ను సీజ్ చేయాల్సింది పోయి అక్రమంగా వినియోగదారులకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. ఈ విషయం బయటపడటంతో ఉన్నతాధికారులు ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. కానిస్టేబుల్స్ స్వామి, నరహరి కొన్నేళ్లుగా తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన కోసం పని చేసే ఈగల్ టీమ్లో విధులు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ పట్టుబడిన సమయంలో దొరికిన పలువురు నిందితుల వివరాలు వీరు సేకరించే వారు. ఆ వివరాలతో వారిని వ్యక్తిగతంగా సంప్రదించి డ్రగ్స్ సేకరించి అమ్ముకున్నారు.
డ్రగ్స్ పెడ్లర్ల కోసం అధికారులు చేపట్టిన తనిఖీల్లో తాజాగా ఈ వ్యవహారం బయటపడింది. ఇటీవల స్వామి, నరహరికి పట్టుబడ్డ ఎక్స్టాసీ టాబ్లెట్లను రికవరీలో చూపకుండా దాచుకొని బయట ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేందుకు ప్రయత్నించారు. వీటి విలువ సుమారు రూ.50 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. డ్రగ్స్ పెడ్లర్లు ఇచ్చిన సమాచారంతోనే ఉన్నతాధికారులు వీరిపై నిఘా పెట్టి, అంతర్గత విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు. స్వామి, నరహరిని ప్రస్తుతానికి విధుల నుంచి దూరంగా ఉంచారు. వీరిద్దరూ గతంలో ఈగల్ టీమ్లో అందించిన సేవలకు, డ్రగ్స్ పట్టుకున్నందుకు పలు అవార్డులు కూడా అందుకున్నారు. ఇక డ్రగ్స్ నిరోధించాల్సిన వారే డ్రగ్స్ అమ్మకాలకు పాల్పడటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

