కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు సైబర్ భద్రతపై ప్రజల్లో చైతన్యం నింపడమే వీటి లక్ష్యం. ఈ కేంద్రాలకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ను జిల్లా అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఆర్థిక వ్యవహారాల్లో సరైన అవగాహన, అప్రమత్తత కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, మణుగూరు, భద్రాచలం, దమ్మపేట మండలాల్లో ఈ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నిర్వహణ బాధ్యతలను “విడ్స్” స్వచ్ఛంద సంస్థకు అప్పగించారని వివరించారు. ప్రతి కేంద్రానికి ముగ్గురు చొప్పున కౌన్సిలర్లను నియమించి వారికి శిక్షణ కూడా ఇచ్చారన్నారు. వీరంతా తమకు కేటాయించిన గ్రామాల్లో పొదుపు, పెట్టుబడులు, ఆర్థిక క్రమశిక్షణ, బ్యాంక్ లావాదేవీల వినియోగం, సక్రమమైన సిబిల్ స్కోర్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించనున్నారు. గ్రామ స్థాయి సిబ్బంది తగిన సహకారం అందించేందుకు సూచనలు ఇవ్వాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి కోరారు.

