కలం, క్రైమ్ బ్యూరో: అక్రమ ఆస్తుల కేసులో ల్యాండ్స్ అండ్ సర్వే మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరికి (Deputy Director Narahari) 14 రోజుల రిమాండ్ విధించారు. భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టరానే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం సుంకరి నరహరి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సోదాల సమయంలో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. నరహరి ఇంట్లోని బెడ్ రూమ్లో రూ. 1.54 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నరహరి బ్యాంక్ ఖాతాల్లో రూ.2.29 కోట్లు, బ్యాంక్ డిపాజిట్లు (ఎఫ్డీ)లు రూ. 5.04 కోట్లు, నరహరి భార్య పేరు మీద రెండు బ్యాంక్ లాకార్లు ఉన్నట్లు ఏసీబీ (ACB) అధికారులు గుర్తించారు. వీటితోపాటు రంగారెడ్డి జిల్లాలో ఐదు ఓపెన్ ప్లాట్స్, మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పలగూడలో ఒక హై రైజ్ బిల్డింగ్, నార్సింగి, రాజేంద్రనగర్లో రెండు రెసిడెన్సియల్ ఫ్లాట్స్లకు సంబంధించి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. టీఎన్జీఓ కాలనీలో జీ+3 బిల్డింగ్, ఛత్రినాకలో జీ+2 బిల్డింగ్, కీయా కారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం నరహరి (Deputy Director Narahari) నివాసంలో గుర్తించిన ఆస్తుల విలువ రూ.13.05 కోట్లు ఉండగా, బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ. 100 కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు. దీంతో నరహరిపై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు బుధవారం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు.
Read Also: మనమే ఫేమస్ కపుల్.. మోదీతో ఇటలీ ప్రధాని మెలోని సంభాషణ
Follow Us On: X(Twitter)

