కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) నగర శివారు ఏనుమాముల మార్కెట్ సమీపంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, నిషేధిత ప్లాస్టిక్ (Banned Plastic) వస్తువులను తయారు చేస్తున్న’ఉమానాగ్ పాలిమర్స్’ కంపెనీపై టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.12 లక్షల విలువ గల నిషేధిత ప్లాస్టిక్ గ్లాసుల ఉత్పత్తులు, ముడి సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు, టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ జి.బాబులాల్ తన సిబ్బందితో తోట ప్రసాద్ నడుపుతున్న ‘ఉమానాగ్ పాలిమర్స్’ తయారీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీపై దాడి చేశారు. తనిఖీల్లో భాగంగా, పర్యావరణానికి అత్యంత హానికరమైన, ప్రభుత్వం నిషేధించిన తక్కువ మైక్రాన్ కలిగిన ప్లాస్టిక్ గ్లాసులను భారీగా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 12 లక్షల విలువైన స్టాక్ను స్వాధీనం చేసుకొని, షాప్ ఓనర్ తోట ప్రసాద్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వ్యాపారస్తులకు హెచ్చరిక
ఆహార భద్రతా, పర్యావరణం విషయంలో నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ముఖ్యంగా ప్లాస్టిక్ నియంత్రణ చట్టం, పర్యావరణ పరిరక్షణ నిబంధనలు పాటించని వారిపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
Read Also: ఆర్సీబీ సక్సెస్ సీక్రెట్ ఇదే.. కృనాల్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు!
Follow Us On : WhatsApp

