కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తోంది ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తేదారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరని ఆయన విమర్శించారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారని గుర్తు చేశారు. సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, భయపడకుండా ఐక్యతతో పోరాడాలని పిలుపునిచ్చిన తలసాని.. రాబోయే రోజుల్లో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు కార్మికుల సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రస్తుత సీఎంకు ప్రభుత్వం నడిపే విధానమే తెలియడం లేదని తలసాని ఎద్దేవా చేశారు. పోరాటం చేస్తే పోయేదేమీ లేదని, కార్మికులు హక్కుల కోసం నిలబడి కొట్లాడాలని, ముఖ్యంగా విపరీతంగా పెరుగుతున్న ముడి సరుకుల ధరలపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు. తెలంగాణ సాధనలో కార్మికుల పాత్ర కూడా ఉందని, పోలీసులు అడ్డుకున్నా దేనికీ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. రాబోయే 15 రోజుల్లోగా కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే చలో సెక్రెటరీయేట్, చలో అసెంబ్లీ కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఎలా దిగిరాదో చూస్తామని, అసెంబ్లీలో సైతం ఈ విషయాలపై పాలకులను వదిలే ప్రసక్తే లేదని తలసాని స్పష్టం చేశారు.

