కలం, వెబ్ డెస్క్ : పూరి జగన్నాథ్ (Puri Jagannadh) టాలీవుడ్లో ఒకప్పుడు సెన్సెషనల్ డైరెక్టర్. ఇటీవల ఆయన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. ఈ క్రమంలో ఆయన ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో ప్రేమ, జీవితం, సంబంధాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా దేవుళ్లు, మహిళలపై పూరి జగన్నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పర్ఫెక్ట్ భర్త ఎక్కడా దొరకడు.. తన భర్త ఇలా కావాలి.. అలా కావాలి అని రాసిపట్టుకుంటే మహిళలు ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో పడుతారని ఆ వీడియోలో పూరీ (Puri Jagannadh) చెప్పుకొచ్చారు.
పెళ్లైన ప్రతి ఆడవాళ్లు ఏదో ఒక టైంలో కన్నీళ్లు పెట్టక తప్పదన్నారు. జీవితంలో ఎందరు ఏడిపించినా ఎక్కువగా ఏడిపించే అవకాశం మాత్రం భర్తకే దక్కుతుందని పూరి జగన్నాథ్ చెప్పారు. మొగుడు ఎన్ని తప్పులు చేసినా క్షమించాలని సూచించారు. పక్కింటివాళ్లు, ఎదురింటి వాళ్లు చెప్పిన మాటలు విని భర్తతో గొడవ పడకూడదని ఆయన చెప్పుకొచ్చారు. శ్రీరాముడి భార్యే అందరికంటే ఎక్కువగా ఏడిచిందని.. భర్త ఎంత గొప్పోడైతే అన్ని కన్నీళ్లు వస్తాయన్నారు. ప్రతి దేవుడు వాళ్ల భార్యను ఏడిపించిన వారేనన్నారు. సాక్షాత్తు దేవుడినే పెళ్లి చేసుకున్నా ఏడుపు తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. భార్యను ఏడిపించే హక్కు మొగుళ్లకు మాత్రమే ఉంటుందని తెలిపారు. కాబట్టి గుట్టుగా కాపురాలు కానిచ్చేయాలని మహిళలకు పూరి జగన్నాథ్ సూచించారు. కాగా, పూరి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

