కలం, వెబ్ డెస్క్: ప్రొఫెసర్ నాగేశ్వర్పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు (Somu Veerraju) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగేశ్వర్ మేధావి కాదని, కరుడుగట్టిన తీవ్రవాదిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిగా ఆయన వ్యవహరిస్తున్నారని, ఒకప్పుడు నక్సలైట్ భావజాలంతో ఉన్నవారని విమర్శించారు. కమ్యూనిజాన్ని కాపాడుకోలేక ఇప్పుడు టీవీ చర్చల్లో కూర్చొని వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఓ టీవీ డిబేట్ సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు (Prof Nageshwar) అడిగిన ప్రశ్నకు తాను సమాధానం ఇచ్చానని సోము వీర్రాజు (Somu Veerraju) గుర్తు చేసుకున్నారు.. జమ్మూ కశ్మీర్లో పీడీపీ పార్టీతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుందని నాగేశ్వర్ రావు ప్రశ్నించారని చెప్పారు. దేశ ప్రయోజనాలు, రాజకీయ అవసరాల దృష్ట్యా అవసరమైతే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో కూడా పొత్తు పెట్టుకుంటామని తాను స్పష్టం చేశానని పేర్కొన్నారు.
బీజేపీని లక్ష్యంగా చేసుకుని కొందరు మేధావుల ముసుగులో విమర్శలు చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. దేశ రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోకుండా బీజేపీపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. నాగేశ్వర్ రావు వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఆరోపించారు.
ఇటీవల పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఏపీలో కేసులు నమోదయ్యాయి. నాగేశ్వర్ను అరెస్ట్ చేస్తారంటూ కూడా వార్తలు వినిపించాయి. మరోవైపు నాగేశ్వర్కు తెలంగాణ రాష్ట్రంలోని కొందరు జర్నలిస్టులు, ప్రజాసంఘాలు నాగేశ్వర్కు మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో తాజాగా సోము వీర్రాజు చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.
Read Also: అభిజిత్ దీప్కే పిటిషన్.. ఎక్స్ (ట్విట్టర్)కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

