కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం నుండి మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు నోటీసులు (SIT Notices KCR) జారీ అయ్యాయి. ఆ నోటీసులను నందినగర్ లోని ఇంటి గోడకు అతికించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగా ఈ నోటీసులు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెల్లి ఫాంహౌస్కు రావాలని కేసీఆర్ చేసిన విన్నపాన్ని పోలీసులు తిరస్కరించారు.
అధికారిక రికార్డుల ప్రకారం హైదరాబాద్లోని బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసమే ఆయన ప్రధాన చిరునామా అని, విచారణకు అవసరమైన కీలకమైన ఎలక్ట్రానిక్ ఫిజికల్ రికార్డులను ఎర్రవెల్లికి తరలించడం పరిపాలనాపరంగా కష్టమని పోలీసులు స్పష్టం చేశారు. కేసీఆర్ వయస్సును పరిగణనలోకి తీసుకుని, నిబంధనల ప్రకారం ఆయన నివాసంలోనే విచారణ జరిపేందుకు సిద్ధమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్లోని తన నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని ఏసీపీ నోటీసుల్లో ఆదేశించారు.


