కలం, వెబ్ డెస్క్: పేదరికం లేని సమ సమాజ నిర్మాణం కోసం తలపెట్టిన పీ4 తో బాటు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆకాంక్షించారు. ఉగాది (Ugadi) సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ విజయవంతంగా ముందుకు సాగాలని సీఎం కోరారు. షడ్రుచుల సమ్మేళనం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు.. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.. అని చంద్రబాబు పోస్టులో పేర్కొన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

