కలం, వెబ్ డెస్క్ : గల్ఫ్ ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత కొంతకాలంగా హెచ్చరిస్తున్నట్లుగానే ఇరాన్ తన క్షిపణి బలగాలతో గల్ఫ్ దేశాలపై విరుచుకుపడటంతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ప్రధానంగా ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాంబుల వర్షం (Iran Attacks) కురిపించింది. ఖతార్లోని రస్లఫాన్ రిఫైనరీలపై ఇరాన్ భారీగా బాంబు దాడులకు పాల్పడటం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ప్రపంచ ఇంధన అవసరాలకు కీలకమైన ఎల్ఎన్జీ ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ ఈ దాడులకు తెగబడటం గమనార్హం.
ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ ఏరియాపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం (Iran Attacks)తో అక్కడ భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇరాన్ సాగించిన ఈ దుశ్చర్యను ఖతార్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మరోవైపు సౌదీ అరేబియాలోకి ప్రవేశించిన పలు క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని సౌదీ డిఫెన్స్ విభాగం ప్రకటించింది. ఇరాన్ జరిపిన ఈ ఆకస్మిక దాడులతో గల్ఫ్ రీజియన్లో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఈ పరిణామాలు ప్రపంచ చమురు మార్కెట్పై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

