కలం, నిజామాబాద్ బ్యూరో: సమగ్ర ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియ సర్ (SIR)లో భాగంగా నిజామాబాద్ (Nizamabad) నగరం 21వ డివిజన్లో SIR సర్వే జరిగింది. ఈ సర్వేలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్తో కలిసి 21వ డివిజన్ కార్పొరేటర్ పంచ రెడ్డి లలితా చరణ్ ఓటర్లకు SIR ప్రక్రియ గురించి అవగాహన కల్పించారు. మొదటగా 21వ డివిజన్లోని సీనియర్ అడ్వకేట్ కృపాకర్ రెడ్డికి బీఎల్ఓ SIR ప్రక్రియకు సంబంధించి వివరాలు పొందుపరిచే పత్రాన్ని అందించారు. అనంతరం 21వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి లలిత చరణ్ మాట్లాడుతూ.. సర్ ప్రక్రియ పట్ల ప్రజలు అప్రమత్తతతో, అవగాహనతో ఉండాలని సూచించారు. లేని పక్షంలో ఓటర్ల జాబితాలో ఓటు కోల్పోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.
ఓటు కలిగి ఉంటేనే ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకానికి మనం అర్హులం అవుతామని అన్నారు. ఓటు అనేది దేశంలో ప్రాథమిక గుర్తింపులలో ప్రాముఖ్యమైనదని కాబట్టి ప్రజలందరూ వారి వారి వివరాలను సర్ ప్రక్రియలో భాగంగా వచ్చే అధికారులకు సమర్పించాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ కార్డులోని తప్పులను సవరించడం, రెండు చోట్ల ఓటు కలిగి ఉండడం, ఆయా ఇళ్లలో ఎవరైనా వేరే చోటికి వలస వెళ్లిన వారి వివరాలను పక్కాగా సమర్పించడంతో పాటు మరణించిన వారి వివరాలను తెలియజేయాలని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రత్యేక అధికారి ప్రశాంత్, వార్డ్ ఆఫీసర్ ఐశ్వర్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షోయబ్ , డివిజన్ బూత్ లెవెల్ ఆఫీసర్స్, డివిజన్ జవాన్ తదితరులు పాల్గొన్నారు.

