కలం, వెబ్ డెస్క్: NEET UG 2026 ప్రశ్నపత్రం లీకేజీ (NEET Leak Case) వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. ఈ సంచలనాత్మక కేసులో 13 మంది నిందితులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) దాఖలు చేసిన భారీ చార్జ్షీట్ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. నిందితులపై అధికారికంగా ఆరోపణలు నమోదు చేసే అంశంపై రేపు కోర్టులో సమగ్ర వాదనలు జరగనున్నాయి.
ఎన్టీఏకు చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులే ఈ పేపర్ లీక్ ఘటనకు ప్రధాన సూత్రధారులని సీబీఐ తన నివేదికలో స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థ సమర్పించిన దాదాపు 20 వేల పేజీల సమగ్ర చార్జ్షీట్లో మొత్తం 360 మంది సాక్షుల వాంగ్మూలాలు, 422 కీలక పత్రాలు, 43 భౌతిక ఆధారాలను పొందుపరిచారు. నిందితుల పాత్రపై బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని దర్యాప్తు బృందం కోర్టుకు తెలియజేసింది.

