కలం, నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని బీడీ కార్మికులందరికీ (Beedi Workers) జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ (Nirmal Collectorate) ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. బీడీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియలో బీడీ కార్మికులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు నెలకు రూ.4,016 జీవన భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా బీడీ కార్మికులకు రిటైర్మెంట్ అనంతరం నెలకు రూ.6,000 పెన్షన్ అందించాలని కోరారు. బీడీ కార్మికులకు ప్రతి నెలా 26 రోజుల పని కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీడీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అర్హులైన ప్రతి కార్మికుడికి పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టాలని సురేష్ కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టరేట్లో అధికారులకు అందజేశారు.

