కలం, వెబ్ డెస్క్: ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న టాలీవుడ్ సింగర్ మంగ్లీ (Singer Mangli) తాజాగా మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తనతో పాటు 150 మందిని మంగ్లీ మోసం చేసిందని పేర్కొంటూ సుబ్బారావు అనే న్యాయవాది పంజాగుట్ట (Panjagutta) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నేడు మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చారు. సింగపోగు సుబ్బారావు అనే వ్యక్తి తనను బ్లాక్ మెయిల్ చేస్తూ వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 22న ఓ లాయర్ ఆఫీస్కు వెళ్లిన తనను సుబ్బారావు, అతడి అనుచరులు అసభ్య పదజాలంతో దూషించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సుబ్బారావు తాను అడ్వొకేట్ చెప్తూ బెదిరిస్తూ, అమర్యాదగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు.
సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో తనపై ఉన్న కొన్ని వీడియోలను తొలగించాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని సుబ్బారావు డిమాండ్ చేస్తున్నట్లు మంగ్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడు అడిగిన డబ్బు ఇచ్చేందుకు నిరాకరించినందుకు తనపై తప్పుడు ఫిర్యాదు చేసి, మీడియా సాక్షిగా అవమానిస్తూ, అసభ్యకరమైన భాష వాడుతూ వేధిస్తున్నారని ఆమె (Singer Mangli) తన ఫిర్యాదులో వెల్లడించారు. తన పరువు తీస్తామంటూ సుబ్బారావు బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫిర్యాదుపై విచారణ చేపట్టి తనను మానసికంగా వేధిస్తూ, బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని విన్నవించారు. మంగ్లీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!
Follow Us On: Instagram

