కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో(Kothagudem) కార్మికలోకం ఎర్రబారింది. రాష్ట్రంలో ఉన్న 11 ఏరియాల సింగరేణి నేతలు, కార్మికులు (Singareni Workers) సేవ్ సింగరేణి నినాదంతో సోమవారం హెడ్ ఆఫీస్ను ముట్టడించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ మాట్లాడారు. సింగరేణి సంస్థ మనుగడ సాగించాలంటే నూతన బొగ్గు బ్లాక్లను ప్రారంభించాలన్నారు. సింగరేణి కార్మికులు భరిస్తున్న ఆదాయపు పన్ను భారాన్ని యాజమాన్యం భరించాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డు నిర్వహించాలన్నారు. కార్పొరేట్ స్థాయిలో జరిగిన స్ట్రక్చర్ కమిటీ ఒప్పందాలను అమలు చేయకుండా సింగరేణి యాజమాన్యం కార్మికుల జీవితాలతో ఆటలాడుతోందని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల సొంతింటి పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. వివిధ కారణాలతో ఆగిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బాకీ పడిన రూ.51వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, మేయర్ మూడ్ గణేశ్ పాల్గొన్నారు.
Read Also: కష్టాల్లో చెన్నై.. పవర్ప్లేలోనే కుప్పకూలిన టాప్ ఆర్డర్!
Follow Us On: Facebook

