కలం, వెబ్ డెస్క్: ఏపీలో పలు చోట్ల విషాద ఘటనలు (Tragic Incidents) జరిగాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు కర్నూలు జిల్లాకు చెందిన రంగస్వామి (21), ప్రమీల (23)గా గుర్తించారు. వీరు కొన్నాళ్లుగా లింగాపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నట్లు గుర్తించారు. అయితే వీరి మృతికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. అటు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేజీబీవీ విద్యార్థిని నవ్య(12) పాము కాటుతో మృతి చెందింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు కేజీబీవీ హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ప్లాజా వద్ద అర్దరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పక్కనున్న కారుపై భారీ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో కారులో ఉన్న హైకోర్టు సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు మృతి చెందారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. క్రేన్లు, జేసీబీ సాయంతో సిమెంట్ ట్యాంకర్ను సిబ్బంది పక్కకు తీశారు. శ్రీనివాసరావు మృతి పట్ల హైకోర్టు న్యాయవాదుల సంఘం సంతాపం తెలిపింది.
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగానిలో నాలుగేళ్ల విద్యార్థి పాఠశాల బస్సు కింద పడి మరణించాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే చిన్నారి మరణించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థి కుటుంబసభ్యులు, గ్రామస్థులు రహదారిపై ఆందోళన చేపట్టారు. బస్సులో సహాయకుడు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు వెంకట్రావు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. పాయిజన్ ఇంజక్షన్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు బెల్లంకొండ మండలం వాసిగా గుర్తించారు.
Read Also: మరో విషాదం.. అమెరికాలో విజయనగరం టెకీ మృతి
Follow Us On: Sharechat

