కలం, నిజామాబాద్ బ్యూరో: గుప్త నిధుల తవ్వకాలు అంటే ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతాలు, గ్రామ శివార్లలో ఆలయాలు, ప్రాచీన కట్టడాల్లో జరుగుతున్నాయని వింటుంటాం. కానీ, నిజామాబాద్ (Nizamabad) నగర నడిబొడ్దున గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని తెలియడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఓ మహిళ తన ఖాళీ స్థలంలో తవ్విస్తున్నారని తెలిసీ మరింత చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో ఓ మహిళ గత నాలుగైదు రోజులుగా రాత్రి వేళల్లో తడకలతో షెడ్లు వేసి అందులో గుంతలు తవ్విస్తోంది. దీనిపై శుక్రవారం రాత్రి మహిళను ప్రశ్నించగా పారిపోయింది. దీంతో, స్థానికులు నాలుగో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని పోలీసులు స్థానికులకు ధైర్యం చెప్పారు.

