కలం, మెదక్ బ్యూరో : ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో మనస్తాపానికి గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. చేగుంట (Chegunta) మండల పరిధిలోని మక్కా రాజుపేట తండాకు చెందిన రాట్ల భిక్షపతి తన ధాన్యాన్ని గత కొన్ని రోజులుగా సొసైటీ కొనుగోలు కేంద్రంలో ఉంచాడు. కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురై ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దే పురుగుల మందు సేవించాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్ సహాయంతో భిక్షపతిని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

