కలం, ఖమ్మం బ్యూరో : సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం వడ్డీ లేని గృహ సాయం రూ.10 లక్షల నుండి రూ.30 లక్షలకు పెంచాలని ఎమ్మెల్యే, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు (MLA Kunammeni Sambasiva Rao) కోరారు. 250 చదరపు గజాల ఇంటి స్థలాలతో కూడిన “సొంత ఇళ్ల పథకాన్ని” ప్రవేశపెట్టి అమలు చేయాలన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి పనులతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్ను సూపర్ స్పెషాలిటీగా మార్చడం ద్వారా కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు ప్రాంతాల కార్మికులతో పాటు ఇతర ఏరియాల కార్మికులకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. అలాగే కొత్తగూడెంలో నూతన ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణానికి సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల నుండి రూ.14 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కూనంనేని కోరారు.
సంస్థలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మారు పేరు కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, అధికారుల పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పిస్తూ తక్షణమే క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచాలన్నారు. ఉద్యోగుల బదిలీల అభ్యర్థనలను పరిశీలించాలని, ఆదాయపు పన్నును రీయింబర్స్ చేయాలన్నారు. సింగరేణి బలోపేతానికి కొత్త బొగ్గు ప్రాజెక్టులు కేటాయించాలని కూనంనేని కోరారు.

