కలం, ఖమ్మం బ్యూరో : ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని.. అందులో భాగంగానే అతి త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Indlu) ఇస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) హామీ ఇచ్చారు. శనివారం ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపల్ ప్రాంతంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎదులాపురం మునిసిపాలిటీ 30 డివిజన్ లలో సుమారు రూ.4.50 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎదులాపురం మునిసిపాలిటీలో మొత్తం రూ.58.95 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన వివరించారు.
గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పేదల సొంతింటి కలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజా పాలన మొదటి సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసిందని వెల్లడించారు. అలాగే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నామని.. మహిళల కోసం ప్రతి సంవత్సరం 23 నుండి 24 వేల కోట్ల రూపాయల వరకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 73 వేల ఉద్యోగాలు ఇచ్చామని, విద్య, ఆరోగ్య రంగాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి (Minister Ponguleti Srinivasa Reddy) వివరించారు. అనంతరం పొంగులేటి ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 64 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను, 227 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పీ.శ్రీనివాస్ రెడ్డి, ఎదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: జీవన్ రెడ్డిని చూసి జనం నవ్వుకుంటున్నారు: పీసీసీ చీఫ్
Follow Us On: Instagram

