కలం, కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట (Yellareddypet) మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంను దుండగులు ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఉన్న ఏటీఎంను, దుండగులు బొలెరో వాహనంలో వచ్చి ఎత్తుకెళ్లడం స్థానికంగా సంచలనంగా మారింది.
విషయం తెలుసుకున్న రాజన్న జిల్లా ఎస్పీ మహేష్ బిగితే, డీఎస్పీ నాగేంద్ర చారి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. సీసీ కెమెరాల ఆధారంగా బొలెరో వాహనం ఏ దిశగా వెళ్లిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ బృందాలు ఆధారాలను సేకరిస్తున్నాయి.
శుక్రవారం రాత్రి ఈ ఏటీఎంలో 8 లక్షల రూపాయల నగదును నింపినట్లు తెలుస్తోంది. దీనిపై ముందుగానే రెక్కీ నిర్వహించిన దుండగులు, పక్కా పథకం ప్రకారం ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డు లేకపోవడం, కేవలం సీసీ కెమెరాలు మాత్రమే ఉండటాన్ని దుండగులు ఆసరాగా చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
Read Also: రెండు కోట్ల ఓట్లు గల్లంతు.. ‘సర్’ ప్రాసెస్ ఎఫెక్ట్..
Follow Us On : WhatsApp

