కలం, సినిమా : స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ” మా ఇంటి బంగారం”(Maa Inti Bangaaram). నందినీ రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 19న గ్రాండ్ రిలీజ్కి సిద్దమైంది. ఈ సినిమాను సమంత తన సొంత ప్రొడక్షన్ హౌస్ అయిన ట్రలాలా పిక్చర్స్ బ్యానర్పై గ్రాండ్గా నిర్మించింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపధ్యంలో వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. ప్రమోషన్స్లో భాగంగా సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ సందర్భంగా మహిళా ప్రధాన కథాంశాలపై సమంత తన బలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
“నేను మహిళా కేంద్రిత కథలపై నమ్మకం ఉందని చెబితే.. ఆ సినిమాలకు నేను స్వయంగా పెట్టుబడి పెట్టాలి. లేనిపక్షంలో మాట్లాడకపోవడమే మంచిది,” అంటూ సమంత స్పష్టం చేశారు. మాటలకే పరిమితం కాకుండా, ఆచరణలో కూడా తమ నమ్మకాన్ని చూపించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. సినిమా పరిశ్రమలో మహిళా ప్రధాన కథలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సమంత అభిప్రాయపడ్డారు. మహిళా పాత్రలు బలంగా ఉండే కథలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, అలాంటి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం కీలకమని తెలిపారు. సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సినీ రంగంలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. మహిళా సాధికారత, కంటెంట్ ఆధారిత సినిమాలపై ఆమె చూపిస్తున్న నిబద్ధతను అభిమానులు ప్రశంసిస్తున్నారు.

