కలం, నల్లగొండ బ్యూరో: బకాయి బిల్లుల విడుదల కోసం తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చిన ‘ఛలో హైదరాబాద్’ నిరసన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) అసోసియేషన్ ప్రతినిధులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితులను వివరించి ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకోవాలని కోరారు. బిల్డర్ల (Builders) డిమాండ్లు న్యాయబద్ధమైనవేనని మంత్రి అంగీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బకాయిల క్లియరెన్స్ కోసం ప్రయత్నిస్తోందని చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై, ప్రాధాన్యత క్రమంలో నిధులు విడుదల చేస్తామని కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని మంత్రి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఆర్ అండ్ బీ శాఖలో ఏకంగా రూ. 4,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్ళిందని, కాంట్రాక్టర్లు కష్టపడి పనిచేసినా బిల్లులు చెల్లించలేదని విమర్శించారు. యాదగిరిగుట్టను అద్భుతంగా కట్టామని గొప్పలు చెప్పుకున్న గత పాలకులు, అక్కడ పనిచేసిన బిల్డర్లకు రూ. 350 కోట్ల మేర బిల్లులు ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. కేవలం వార్తల్లో నిలవడం కోసమే కేటీఆర్, హరీశ్ రావు తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టుల కేటాయింపుల్లో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని, రికార్డులు పరిశీలిస్తే తాము చేసిన పొరపాటును గ్రహించి హరీశ్ రావు ముక్కు నేలకు రాస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల 18న నిర్వహించ తలపెట్టిన ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో అసోసియేషన్ ప్రతినిధులు తమ పంథాను మార్చుకునే యోచనలో ఉన్నారు. మంత్రి ఇచ్చిన హామీలపై అంతర్గతంగా చర్చించుకుని, నిరసన విరమణపై మంగళవారం సాయంత్రంలోగా తమ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు.

