కలం, వెబ్డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు పోక్సో కేసు వ్యవహారంలో తెలంగాణ పోలీసులపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసులు అసమర్థతకు కేరాఫ్ అడ్రస్గా మారారని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ చేసిన పోస్టుకు రిప్లై ఇస్తూ ప్రవీణ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ప్రధాని మోదీ భద్రతలో పోలీసులు బిజీగా ఉన్నందున మైనర్ బాలిక ఫిర్యాదుపై స్పందించడంలో ఆలస్యమైందని చెప్పడం హాస్యాస్పదమని సదరు నెటిజన్ తన పోస్టులో రాసుకొచ్చాడు. ఇక ప్రధాని వస్తే సామాన్య పౌరుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు. తమ రక్షణ తామే చూసుకోవాలా? అని కామెంట్ చేశాడు. డ్యామేజ్ కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులు తమ వైఫల్యాన్ని తామే ఒప్పుకున్నారని, ఇది తెలంగాణ పోలీస్ వ్యవస్థకు అవమానమని విమర్శించాడు.
ఈ పోస్టుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. ప్రస్తుతం తెలంగాణ పోలీసులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బందోబస్తులో బిజీగా ఉన్నారని, ఎవరి పిల్లల భద్రత వారే చూసుకోవాలని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా, ఆవిష్కరణలకు మారుపేరుగా ఉన్న తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు అసమర్థతకు , రాజకీయ కుమ్మక్కులకు కేరాఫ్ అడ్రస్గా మారిందని విమర్శించారు. తెలంగాణ పోలీసుల ప్రతిష్ట ఇంతగా దిగజారిపోవడం బాధాకరమని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

