బెంగళూరు బీభత్సం.. పంజాబ్‌కు ఘోర ఓటమి

కలం, వెబ్ డెస్క్:  ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ (RCB)  బెంగళూరు చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో కోహ్లీ, పడిక్కల్, వెంకటేష్ ఆకాశమే హద్దుగా చెలరేగితే.. బౌలింగ్‌లో కృణాల్ పాండ్య మినహా మిగిలిన వారంతా వికెట్లు పడగొట్టి పంజాబ్‌ వెన్నువిరిశారు.

పంజాబ్ టాప్‌ ఆర్డర్‌లో కనోలి మినహా మరెవరు రెండంకెల స్కోర్ కూడా చేయలేదు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సైతం 1 పరుగుకే పెవిలియన్ బాటపట్టాడు. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క పరుగుకే ఓపెనర్ ప్రియాంష్ ఆర్య వికెట్ కోల్పోయాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆర్సీబీ.. పంజాబ్‌పై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ జాకబ్ బెథెల్ (11) త్వరగానే అవుటైనా, రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), దేవదత్ పడిక్కల్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరు అవుటైన తర్వాత వెంకటేష్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (12 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీశాడు.

223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. భువనేశ్వర్ కుమార్ దాటికి ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య (0), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (1) ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పంజాబ్ తీవ్ర కష్టాల్లో పడింది. ఆ దశలో కూపర్ కనోలి (37), సూర్యాన్ష్ షెడ్జ్ (35) కాసేపు పోరాడినా రన్ రేట్ ఒత్తిడి పెరిగిపోయింది.

మిడిల్ ఆర్డర్‌లో మార్కస్ స్టోయినిస్ (37) ఆకట్టుకోగా, చివర్లో శశాంక్ సింగ్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసి పంజాబ్ ఆశలు సజీవంగా ఉంచే ప్రయత్నం చేశాడు. అయితే ఆర్సీబీ బౌలర్ రాసిఖ్ సలామ్ కీలక సమయాల్లో వికెట్లు తీసి పంజాబ్‌ను దెబ్బకొట్టాడు. రాసిఖ్ సలామ్ 3 వికెట్లతో మెరవగా, భువనేశ్వర్ కుమార్ 2, హాజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రొమారియో షెపర్డ్ తలా ఒక వికెట్ సాధించారు. చివరకు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Read Also: థాయ్‌లాండ్ ఓపెన్: రన్నరప్‌గా సాత్విక్-చిరాగ్ జోడి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>