కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ (Telangana Movement Activists Recognition Committee) ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కమిటీ చైర్మన్ కేశవరావు నేతృత్వంలో మొదటిసారి సమావేశం అయ్యారు. ఈ భేటీలో కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రభుత్వం అధికారికంగా కమిటీ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు.
అమరవీరుల జ్యోతి కింద ఉన్న కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసేలా కమిటీ లో నిర్ణయం తీసుకున్నారు. అమరవీరుల గుర్తింపు కోసం త్వరలో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి వారి ప్రతిపాదనలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, 1969 ఉద్యమకారులు , ఉద్యోగ సంఘాలు, కళాకారుల జేఏసీ, సబ్బండ వర్గాల జేఏసీ , కుల సంఘాల, న్యాయవాదులు జేఏసీ, వివిధ జిల్లాలో ఏర్పడిన ఉద్యమ సంఘాలు ప్రతిపాదనలు తీసుకోనున్నారు.
ఉద్యమకారుల కమిటీ జిల్లా పర్యటనలు చేసి విస్తృతంగా ప్రజల అభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, ఉద్యమకారులను గుర్తించడానికి నాలుగు రకాల ప్రతిపాదనలు కమిటీ రూపొందించింది.
1.తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారిని మొదటి ప్రాధాన్యత .
2.ఉద్యమంలో గాయపడిన వారికి రెండవ కేటగిరి గా తీసుకునేందుకు ప్రతిపాదన
3. తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లినవారు, అరెస్టులు అయిన వారు, ఉద్యమ కేసులు అయిన వారిని మూడవ కేటగిరలో చేర్చేందుకు ప్రతిపాదించారు.
4. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేసిన వారిని నాలుగవ కేటగిరి గా తీసుకోవాలని ప్రతిపాదించారు. నాలుగవ కేటగిరి గుర్తించడానికి వారు ఉద్యమంలో చేసిన పేపర్ కటింగ్స్ చూడాలని నిర్ణయం
ఉద్యమ సమయంలో సమాజంలో కీలకంగా వ్యవహరించిన వారి నుంచి ప్రతిపాదనలు తీసుకునేందుకు కమిటీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమ అస్థిత్వాన్ని కాపాడేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేసిందని, రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారుల ఎంపిక ఉంటుందని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో కొంత మందికి మాత్రమే సహాయం అందించారని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పార్టీలకు అతీతంగా ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉద్యమకారుల కమిటీ ప్రతిపాదించిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి తో కమిటీ చర్చించనుంది.
Read Also: బండి భగీరథ్ ఇష్యూ.. తెలంగాణలో బీజేపీ డ్యామేజ్ కంట్రోల్
Follow Us On: Instagram

