కలం, వెబ్ డెస్క్: సాత్విక్ రెడ్డి, చిరాగ్ శెట్టిల జోడీ థాయ్లాండ్ ఓపెన్(Thailand Open 2026)లో టైటిల్కు ఒక్క అడుగు దూరంలో ఆగింది. బ్యాంకాక్లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో ఇండోనేషియా ద్వయం లియో రోలి కర్నాడూ, డానియల్ మార్టిన్ జోడీ చేతిలో 21-12, 25-23 తేడాతో ఓటమి పాలై రన్నరప్గా నిలిచింది. 53 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో రెండో గేమ్ చివరి వరకు భారత జోడీ పోరాడినా, టైటిల్ మాత్రం చేజారింది. ఈ టోర్నీలో భారత్ ఆశలన్నీ సాత్విక్-చిరాగ్పైనే నిలిచాయి. స్టార్ షట్లర్లు పీవీ సిందు, లక్ష్యసేన్ ముందుగానే నిష్క్రమించడంతో ఈ జోడీ బాధ్యత భుజాన వేసుకుంది. 2024లో ఇక్కడే టైటిల్ గెలిచిన సాత్విక్-చిరాగ్, మరోసారి చాంపియన్ కావాలనే లక్ష్యంతో బరిలోకి దిగారు.
సెమీస్లో మలేషియా జోడీ గోహ్ స్జే ఫీ-నూర్ ఇజ్జుద్దీన్పై 19-21, 22-20, 21-16తో అద్భుత కంబ్యాక్ విజయం సాధించి 2026 సీజన్లో తొలి ఫైనల్ చేరారు. కీలక సమయంలో వరుస పాయింట్లు సాధిస్తూ మ్యాచ్ను తమవైపు తిప్పుకున్నారు. ఫైనల్లో తొలి గేమ్లో తడబడిన భారత జోడీ రెండో గేమ్లో మాత్రం అసలైన ఫైట్ చూపించింది. ఇండోనేషియా జోడీకి వచ్చిన ఐదు ఛాంపియన్షిప్ పాయింట్లను కాపాడుతూ మ్యాచ్ను ఉత్కంఠభరితం చేసింది. కానీ చివరి క్షణాల్లో అదృష్టం కలిసి రాక టైటిల్ చేజారింది.

