కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026లో భీకరమైన జట్టుగా పేరొందిన ఆర్సీబీకి గుజరాత్ బౌలర్లు వణుకుపుట్టించారు. అరవీర భయంకరంగా ఆడతారనుకున్న బ్యాటర్ల వికెట్లను వరుసబెట్టి తీశారు. అద్భుతమైన బౌలింగ్తో గుజరాత్ తన సత్తా చాటుకుంది. నిప్పులు చెరిగే బంతులతో అర్షద్ ఖాన్, స్పిన్ మాయాజాలంతో రషీద్ ఖాన్ ఆర్సీబీ వెన్ను విరిచి గుజరాత్ విజయావకాశాలను మెరుగుపరిచారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టారు. మ్యాచ్ (GT vs RCB) ఆరంభంలోనే జాకబ్ బెథెల్ (5)ను సిరాజ్ పెవిలియన్ పంపగా, ధాటిగా ఆడుతున్న విరాట్ కోహ్లీ (13 బంతుల్లో 28)ని రబడా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ (40) కాసేపు పోరాడినా, అతనికి మిగిలిన బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. కెప్టెన్ రజత్ పాటిదార్ (19) నిలదొక్కుకుంటున్న సమయంలో అర్షద్ ఖాన్ దెబ్బకొట్టాడు.
మధ్య ఓవర్లలో రషీద్ ఖాన్ తన స్పిన్ మ్యాజిక్తో పడిక్కల్ను క్లీన్ బౌల్ చేయడంతో ఆర్సీబీ పతనం వేగవంతమైంది. జితేష్ శర్మ (1), టిమ్ డేవిడ్ (9), కృనాల్ పాండ్యా (4) సింగిల్ డిజిట్కే పరిమితమవ్వడంతో స్కోర్ బోర్డు నెమ్మదించింది. చివర్లో రొమారియో షెపర్డ్ (17), వెంకటేష్ అయ్యర్ (12) కనీసం పోరాడలేకపోయారు. భువనేశ్వర్ కుమార్ (15 నాటౌట్) చివర వరకు క్రీజులో ఉండటంతో ఆర్సీబీ కనీసం 150 పరుగుల మార్కును దాటగలిగింది. 19.2 ఓవర్లలో 155 పరుగుల వద్ద ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసింది. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్ 3.2 ఓవర్లలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లతో చెలరేగగా, రషీద్ ఖాన్ తన 4 ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. హోల్డర్ సైతం 2 వికెట్లతో రాణించాడు. ఇప్పుడు గుజరాత్ ముందున్న లక్ష్యం 156 పరుగులు. బౌలింగ్లో సత్తా చాటిన టైటాన్స్, బ్యాటింగ్లో ఎలా రాణిస్తారో చూడాలి

