కలం, వెబ్ డెస్క్: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్(CEC Gyanesh Kumar) పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు. ఈ తీర్మానానికి 193 మంది ఎంపీలు సంతకాలు చేసినప్పటికీ, నిబంధనల పరంగా ముందుకు సాగేందుకు అర్హత లేదని చైర్మన్ నిర్ణయించినట్లు సమాచారం.
అభిశంసన తీర్మానం ఎందుకు?
సీఈసీ తీరును మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, ఇతర పక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది వారి ఆరోపణ. సర్ ప్రక్రియ మీద కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఉద్దేశ్యపూర్వకంగా బీజేపీ వ్యతిరేకుల ఓట్లను తొలగిస్తున్నారని రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో ఆరోపించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటర్ల పేర్లు తొలగింపు, క్లెయిమ్స్ పరిశీలనలో పారదర్శకత లేదని వారు ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ తీరుపై రాజకీయ పక్షాల అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈవీఎంలపై కూడా కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ప్రధాన ఎన్నికల కమిషనర్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. చివరకు రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు.

