ఐదు పంచాయతీలపై తుమ్మల ప్రయత్నం అభినందనీయం

కలం, ఖమ్మం బ్యూరో:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో కలపాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాయడం, పార్లమెంటులో పోరిక బలరాం నాయక్, వద్దిరాజు రవిచంద్ర ఐదు పంచాయతీలను ప్రస్తావించడం అభినందనీయమని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు (Macha Venkateswarlu) అన్నారు.

సోమవారం స్థానిక చందర్రావు భవనంలో ఎర్రం శెట్టి వెంకట రామారావు అధ్యక్షతన జరిగిన సిపిఐ(ఎం) పట్టణ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన మిగతా పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదు గ్రామపంచాయతీలపై ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నించాలని అన్నారు. అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం, ఐదు పంచాయతీల కల్పన అంశాన్ని ప్రస్తావించకపోవడం దుర్మార్గమని అన్నారు.

తెలంగాణలో ఉన్న ఎనిమిది మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఐదు గ్రామపంచాయతీల విషయంలో నోరు మెదల్చకపోవడం వివక్షత అని మచ్చ పేర్కొన్నారు. గతంలో కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనేక సార్లు ఈ విషయంపై కేంద్రానికి విన్నపించినప్పటికీ సరైన స్పందన రాలేదని గుర్తుచేశారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా, పోలవరం ప్రాజెక్ట్ వల్ల బ్యాక్ వాటర్ వల్ల ముంపు ప్రమాదం ఉన్న భద్రాచలం పట్టణాన్ని రక్షించడం కూడా కేంద్ర బాధ్యత అని అన్నారు. భద్రాచలం అభివృద్ధికి కరకట్ట పునర్మాణ పనులు వెంటనే ప్రారంభించాల్సిందని, పునర్నిర్మాణం లేకుండా ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రశ్నార్థకం అని మచ్చ విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, మరియు కార్యదర్శి వర్గ సభ్యులు సున్నం గంగా, పారెల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>