కలం, వెబ్ డెస్క్: ప్రేమ విఫలమైందన్న ఆవేదనతో ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. ఈ ఘటన మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా గూడూరు మండలం గుండె శివారు వాగ్య తండాలో జరిగింది. కేసముద్రం మండలం రేకుల తండాకు చెందిన గూగులోత్ స్పందన, వాగ్య తండాకు చెందిన తేజావత్ రఘురాం గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి (Marriage) ప్రస్తావన వచ్చేసరికి రఘురాం నిరాకరిస్తుండటంతో బాధితురాలు గతంలోనే గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టింది. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తాజాగా రఘురాం ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని స్పందన మౌన దీక్ష చేపట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు ముఖం చాటేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. తనను భార్యగా అంగీకరించే వరకు పోరాటం ఆపేది లేదని యువతి స్పష్టం చేసింది.

