కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో నామినేటేడ్ పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం క్లారిటీ ఇచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇటీవల మాట్లాడుతూ.. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నేతలు పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు.
నాయకుల్లో చిగురిస్తున్న ఆశలు
నామినేటెడ్ పదవుల (Nominated Posts) కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత రెండేళ్లుగా నిరాశ నిస్ఫృహలతో ఉన్న నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మార్చి 15 తర్వాత నామినేటెడ్ పోస్టులతోపాటు పదవులన్నింటినీ భర్తీ చేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు మంత్రుల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆయా జిల్లాల్లో డీసీసీ, లైబ్రరీ చైర్మన్ లాంటి కీలక పదవులు ఇప్పటికే భర్తీ అయ్యాయి. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాలకవర్గాలు సైతం భర్తీ అయ్యాయి. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం మినహా అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల నియామకాలు పూర్తయ్యాయి. డీసీసీల్లో కార్యవర్గం భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ పరంగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించడం, వాయిదా వేయడం జరిగింది. ఈ క్రమంలో కార్యకర్తల్లో కొంత నిరాశ చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటీవల పార్టీ అధిష్ఠానం ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులతో సమావేశమయ్యారు. నామినేటేడ్ పదవులు భర్తీపైనే చర్చ జరిగినట్టు సమాచారం.
నేతల చుట్టూ ప్రదక్షిణలు
కరీంనగర్ (Karimnagar) ఉమ్మడి జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీలో గ్రంథాలయ చైర్మన్ పదవులను భర్తీ చేశారు. వారి పదవీకాలం సైతం రెండేళ్లు పూర్తి కావస్తోంది. ఆయా జిల్లా లైబ్రరీ సంస్థలో డైరెక్టర్ల పదవులను సైతం భర్తీ చేయాల్సి ఉంది. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పదవి సైతం రెండేళ్లకు దగ్గరగా ఉంది. ఆర్టీఏ మెంబర్గా పడాల రాహుల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టిఏ మెంబర్గా సంగీత శ్రీనాథ్లను నియమించారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్గా సత్తు మల్లేశ్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రంథాలయ చైర్మన్గా నాగుల సత్యనారాయణ, పెద్దపల్లి జిల్లాలో గ్రంథాలయ చైర్మన్గా అంతటి అన్నయ్య గౌడ్ నియమితులయ్యారు. రాష్ట్రస్థాయి పదవిలో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రామడుగుకు చెందిన నేరెళ్ల శారద రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్గా కొనసాగుతున్నారు. ఆమె పదవి సైతం రెండేళ్లు పూర్తి కావస్తున్నది. ఉమ్మడి జిల్లాలో లైబ్రరీ కమిటీ సభ్యులలో భర్తీకి 50 మందికి పైగా పదవులు పొందే అవకాశం ఉంది. కరీంనగర్ నుంచి రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా గతంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్కు పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం ఆ పదవి రెండేండ్లుగా ఖాళీగా ఉంది. అయితే ఈ పదవి ఎక్కువగా కరీంనగర్, పెద్దపల్లి జిల్లాకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది.
ఆ పదవి మీద కన్నేసిన నరేందర్ రెడ్డి
కరీంనగర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్ రెడ్డి ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పదవికి, నగర అధ్యక్ష పదవి కోసం ధరఖాస్తు చేసుకున్నా ఆయనకు నిరాశే ఎదురైంది. కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు సైతం అధిష్ఠానంతో మొర పెట్టుకున్నట్టు సమాచారం. మంత్రి పొన్నం ప్రభాకర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కరీంనగర్ కార్పోరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ సైతం నామినేటెడ్ పదవికి ప్రయత్నిస్తున్నారు. సీనియర్గా పేరున్న కరీంనగర్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు తదితరులు ఈ పదవుల మీద ఆశ పెట్టుకున్నారు.
మంత్రుల ఆశిస్సులు ఎవరికి?
కరీంనగర్ (Karimnagar) ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులను కలిసి తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారి అనుచరులకు పదవులు కట్టబెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ మూడు వర్గాలుగా విడిపోయిందన్న వాదన ఉంది. పార్టీ కార్యక్రమాలు సైతం విడివిడిగా చేస్తుండడం అందుకు బలం చేకూరుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా కరీంనగర్లో కొంతమేర వర్గ విబేధాలు కనిపిస్తున్నాయి. ఫ్లెక్సీలు, పదవులు, ప్రెస్మీట్లు తదితర వివాదాలతో రచ్చ కొనసాగుతోంది. గతంలోనూ నామినేటెడ్ విషయంలో ఎవరికి నచ్చిన వారినే పదవులు భర్తీ చేశారు. ప్రస్తుతం భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవులపై దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు.
Read Also: నందిని సిధారెడ్డికి సాహిత్య అకాడమీ అవార్డు
Follow Us On: Sharechat

