పంజాబ్ కింగ్స్ బోణి.. శ్రేయాస్ వ్యూహాలకు ఆకాష్ చోప్రా ఫిదా!

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) అద్భుత విజయంతో ప్రస్థానాన్ని ప్రారంభించింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం సాధించగా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అనుసరించిన వ్యూహాలను మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra) కొనియాడారు. ముఖ్యంగా బౌలర్ల మార్పు, కీలక నిర్ణయాల్లో అయ్యర్ పరిణతి ప్రదర్శించారని ఆయన ప్రశంసించారు. చండీగఢ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌ను పంజాబ్ 162 పరుగులకే కట్టడి చేసింది. తాజాగా ఈ మ్యాచ్ పై ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడుతూ.. శ్రేయాస్ కేవలం ఐదుగురు బౌలర్లతోనే ప్లాన్ అమలు చేసిన తీరు బాగుందని పేర్కొన్నారు.

మార్కస్ స్టోయినిస్ వంటి ఆరో బౌలింగ్ ఆప్షన్ అందుబాటులో ఉన్నప్పటికీ, శ్రేయాస్ అతని అవసరం లేకుండానే ఇన్నింగ్స్‌ను ముగించడాన్ని చోప్రా హైలైట్ చేశారు. యుజ్వేంద్ర చాహల్‌ను (Yuzvendra Chahal) సరైన సమయంలో బౌలింగ్‌కు దించి శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్ వంటి కీలక వికెట్లను శ్రేయాస్ పడగొట్టించారని చోప్రా వివరించారు. అర్ష్‌దీప్ సింగ్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, విజయ్‌కుమార్ వైశాఖ్ (3/34), మార్కో జాన్సెన్ వంటి బౌలర్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను శ్రేయాస్ రాబట్టుకున్నారని ఆయన కొనియాడారు. బ్యాటింగ్ విభాగంలోనూ శ్రేయాస్ తీసుకున్న నిర్ణయాలు ఫలించాయని చోప్రా విశ్లేషించారు.

సాధారణంగా లోయర్ ఆర్డర్‌లో ఆడే యువ ఆటగాడు కూపర్ కానోలీని నంబర్ 3లో పంపడం కలిసొచ్చిందని చెప్పారు. కానోలీ 44 బంతుల్లో 72 పరుగులు (అజేయం). ఆ తర్వాత ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌తో కలిసి కీలకమైన 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివరికి పంజాబ్ కింగ్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. ఒక యువ విదేశీ ఆటగాడు బాధ్యత తీసుకుని జట్టును గెలిపించడం పట్ల చోప్రా (Aakash Chopra) సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ ఇదే జోరును కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారని తెలిపారు.

Read Also: హనీ కాఫీ లెమనేడ్ : ఈ వేసవిలో వైరల్ అవుతున్న రిఫ్రెషింగ్ డ్రింక్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>