కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్దమైతే.. పర్యటన అనుమతిని కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం నిరంకుశత్వానికి నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ గ్రామాల్లో మంత్రిప్రత్యేకంగా చేపట్టిన ‘పల్లె పల్లెకు ప్రజాపాలన–పల్లె పల్లెకు పొన్నం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని.. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం.. రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర బీజేపీ నాయకులు.. తెలంగాణకు నిధులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకురావడంలో విఫలమయ్యారని మంత్రి దుయ్యబట్టారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ 2047 రైజింగ్కు కేంద్ర సహకారం అవసరమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ అడ్డంకులు సృష్టించడం సరికాదని పేర్కొన్నారు. రాజకీయాలు కాకుండా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

