కలం, వెబ్డెస్క్: పరకాల (Parakala) ఎమ్మెల్యే సీటుపై నెలకొన్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ (Naveen Yadav) ఈ వివాదంపై స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కొండా సురేఖ ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలనే కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని బలహీన పర్చాలని తక్కువ చేసి మాట్లాడుతున్నారని కొండా ఫ్యామిలీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేస్తున్న క్రమంలో కావాలనే కొందరు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ప్రజలు, యువత, శాసనసభ్యుల అండదండలు ఉన్నంత కాలం సీఎం రేవంత్ రెడ్డిని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ ఎంతో మంది యువతకు అవకాశాలు కల్పిస్తోందన్నారు. మూడేళ్ల క్రితమే పార్టీకి వచ్చినా తనను గుర్తించి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని చెప్పారు. కష్టపడితే పార్టీ, పెద్దలు గుర్తిస్తారని తెలిపారు. అంతే కానీ పెద్దలు మాట్లాడిన మాటలకు బాధపడి, వారికి గౌరవం ఇవ్వకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని నవీన్ యాదవ్ అన్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని, ఇప్పుడే ఎందుకు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలపై తక్షణమే ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను సహించకుండా పార్టీ క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి భవిష్యత్తు ఉండబోదని స్పష్టం చేశారు.

