కలం, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం హైదరాబాద్ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణకు మోదీ రావటం ఇదే మొదటిసారి. తన హైదరాబాద్ పర్యటనలో రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని మోదీ.. మాదాపూర్ లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మోదీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శిస్తారని వార్తలు అందుతున్నాయి. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ నివాసానికి వస్తారని సమాచారం అందుతోంది. ప్రధాని మోదీ పర్యటన వేళ మాదాపూర్, పవన్ కళ్యాణ్ నివాస పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి మధ్య జరగనున్న ఈ భేటీ పై అటు సినీ పరిశ్రమలో, ఇటు రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

